Congress: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లినందుకు మహేశ్వర్ రెడ్డి బాధపడుతున్నారు: టీపీసీసీ అధికార ప్రతినిధి

- విమర్శలు చేస్తే కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తామని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా
- బీజేపీ గెలిచిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్య
- నిధులు తేవడం చేతకాదని బీజేపీ నేతలు ఒప్పుకోవాలన్న సత్యం శ్రీరంగం
కాంగ్రెస్ పార్టీ నుంచి అనవసరంగా బీజేపీలోకి వచ్చానని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బాధపడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ గెలిచిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.
కేంద్రం ఇచ్చే నిధులపై ఎంపీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాలేదని మండిపడ్డారు. నిధులు తేవడం చేతకాదని ఒప్పుకోవాలని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీ కార్యాలయంలో కనీసం కుర్చీ కూడా లేదని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉందని అన్నారు. కానీ ఆయనకు అంత సీన్ లేదని అన్నారు.
పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలనలో తమ ప్రభుత్వం విఫలం కాలేదని అన్నారు. కానీ ప్రజలకు చేసింది చెప్పడంలో విఫలమయ్యామని అన్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని, బీఆర్ఎస్కు చింత చచ్చినా పులుపు చావలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, రేవంత్ రెడ్డి దానిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.