Mega Women's Special Interview: గొప్ప వాళ్లందరూ ఇలాగే పాక్కుంటూ వెళతారేమో: చిరంజీవి

- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మెగా ఉమెన్స్ పేరిట స్పెషల్ ఇంటర్వ్యూ
- చిరంజీవి, నాగబాబు, అంజనా దేవి, విజయ, మాధవిలతో ఇంటర్వ్యూ
- ఆసక్తికర అంశాలు వెల్లడించిన మెగాస్టార్
నేడు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని మహిళలతో ప్రత్యేక వీడియో రూపొందించారు. మెగా ఉమెన్స్ పేరిట రికార్డ్ చేసిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో చిరంజీవి, నాగబాబుతోపాటు వారి మాతృమూర్తి అంజనా దేవి, వారి చెల్లెళ్లు మాధవి, విజయ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి బాల్యంలో జరిగిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నారు. ఇంట్లో పిల్లలందరిలోకి తానే పెద్దవాడ్నని వెల్లడించారు.
"అప్పుడు నాకు మూడేళ్ల వయసుంటుంది అనుకుంటా... ఇంట్లోంచి పాక్కుంటూ రోడ్డు మీదకి వచ్చేశాను. ఎటు వెళ్లాలో అర్థంకాక రోడ్డుమీదే ఏడుస్తూ ఉండిపోయాను. అక్కడే ఓ కొలిమి ఉంది. అందులో పనిచేసే వ్యక్తి నన్ను గమనించి కొలిమి వద్దకు తీసుకెళ్లాడు. మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడంటూ మా ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అప్పటికే నేను కొలిమి వద్ద మసి పూసుకుని గుర్తుపట్టలేని విధంగా ఉన్నాను.
ఇంతలో అమ్మ వచ్చింది. మసి పూసుకుని ఉన్న నన్ను చూసి ఎవరి బిడ్డో అనుకుంది. వీడు మా అబ్బాయి కాదు అని వెళ్లిపోబోయింది. మళ్లీ ఎందుకనో ఆగి... పరీక్షగా చూసి వీడు మా అబ్బాయే అంటూ గుర్తుపట్టింది. నన్ను ఇంటికి తీసుకువచ్చి... ఎటూ వెళ్లిపోకుండా కాలికి తాడు కట్టేసింది. అప్పట్లో శ్రీకృష్ణుడు అంతటివాడ్ని కూడా కాలికి తాడుతో కట్టేశారు... నన్ను కూడా అలాగే కట్టేశారు. గొప్పవాళ్లంతా ఇంతేనేమో... పాక్కుంటూ వెళతారేమో" అంటూ చిరంజీవి చమత్కరించారు.
రమ చనిపోవడంతో చేతుల మీద ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాం
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి ఇప్పటివరకు చాలామందికి తెలియని ఓ విషయం చెప్పారు. తాము ఇప్పుడు ఐదుగురు ఉన్నామని... కానీ చిన్నప్పుడే ముగ్గురు బిడ్డలు చనిపోయారని వెల్లడించారు. తాను 6వ తరగతిలో ఉన్నప్పుడు రమ అనే సోదరి ఉండేదని, ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని, రెండ్రోజుల తర్వాత చనిపోయిందని తెలిపారు. దాంతో ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లామని, ఇరుగుపొరుగు వారి సాయంతో మిగతా కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేసుకున్నారు. అప్పటికి తన తండ్రి ఉద్యోగ రీత్యా ఇంట్లో లేరని, ఆయన లేకుండానే ఇవన్నీ చేశామని, ఆయన వచ్చాక ఎంతో బాధపడ్డారని చిరు విచారం వ్యక్తం చేశారు.
ఉమెన్స్ డే సందర్భంగా మెగా మాతృమూర్తి అంజనా దేవి సలహా ఇదే
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మెగా మాతృమూర్తి అంజనా దేవి ఇప్పటి జనరేషన్ కు ఓ సలహా ఇచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు,అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు అందరూ కలిసి పరస్పరం తోడుగా ఉంటే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటి రోజుల్లో మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోయాయనిపిస్తోందని విచారం వ్యక్తం చేశారు. తన కుటుంబం విషయానికొస్తే... తన కుమారులు, కుమార్తెలతోనే కాకుండా... కోడళ్లతోనూ తనకు మంచి అనుబంధం ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి అర్ధాంగి సురేఖ అయితే తనకు కూతురితో సమానం అని చెప్పుకొచ్చారు.
ఇంట్లో తల్లికి ముద్దుల బిడ్డ ఎవరో చెప్పిన నాగబాబు
ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమ ఇంట్లో అందరికంటే తల్లికి పవన్ కల్యాణ్ అంటేనే ఇష్టమని చెప్పారు. పవన్ చిన్నప్పుడు బలహీనంగా ఉండేవాడని, అతడి ఆరోగ్యం బాగుండేది కాదని, అందుకే తల్లి అతడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించేదని వివరించారు. పవన్ కు ఇష్టమైనవే అమ్మ ఎక్కువగా వండేది అని గుర్తు చేసుకున్నారు. మా ఇంట్లో పవన్ ఒక స్పెషల్ కిడ్ అని అభివర్ణించారు.