Posani Krishna Murali: పోసానికి పోలీస్ కస్టడీ... రేపు, ఎల్లుండి విచారణ

- చంద్రబాబు, పవన్ పై తప్పుడు వ్యాఖ్యలు
- టీడీపీ నేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు
- కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు
- రెండ్రోజుల కస్టడీ విధిస్తూ నరసరావుపేట కోర్టు ఉత్తర్వులు
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి కేసుల సమస్యలు ఇప్పట్లో తప్పేలా లేవు. ఒక కేసులో బెయిల్ వచ్చిందని సంబర పడాలో, మరో కేసులో కస్టడీ విధించారని బాధపడాలో తెలియన విచిత్ర పరిస్థితిలో పోసాని చిక్కుకున్నారు. తాజాగా ఆయనకు నరసరావుపేట కోర్టు పోలీస్ కస్టడీ విధించింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై పోసాని తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పల్నాడు పోలీసులు ఇటీవల కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పోసానికి ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది.
ఈ క్రమంలో పోలీసులు పోసానిని కస్టడీకి కోరుతో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు నేడు విచారణ చేపట్టింది. పోసానిని రెండ్రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నరసరావుపేట పోలీసులు రేపు, ఎల్లుండి పోసానిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. పోసానిపై ఏపీలో 17 వరకు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.