Nara Lokesh: బీఎడ్ పేపర్ లీక్... పరీక్ష రద్దు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

- నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు
- ఈ మధ్యాహ్నం జరగాల్సిన పరీక్ష... అరగంట ముందే క్వశ్చన్ పేపర్ లీక్
- తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి అరగంట ముందే లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది.
దీనిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కొన్ని గంటల వ్యవధిలోనే స్పందించారు. పేపర్ లీక్ పై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు.