YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయి: వైఎస్సార్ జిల్లా ఎస్పీ

- రెండు రోజుల క్రితం వాచ్మన్ రంగన్న మృతి
- అంతకుముందు మరో నలుగురు సాక్షుల మృతి
- సాక్షుల మరణం వెనుక కారణాల కోసం దర్యాఫ్తు చేస్తున్నామన్న ఎస్పీ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షులు వరుసగా మృతి చెందడం విస్తుగొలిపే అంశమని, వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాఫ్తు చేస్తామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకానంద హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఇటీవల మృతి చెందాడు. అంతకుముందు, శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ మృతి చెందారు.
ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని ఎస్పీ వెల్లడించారు. సాక్షులు ఏయే కారణాలతో, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు.
సాక్షులు చనిపోయినప్పుడల్లా సీబీఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రచారాన్ని ఎందుకు, ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.
వాచ్మన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందాడని, రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన సాక్షులకు సంబంధించిన కేసులన్నింటిని దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.