Chandrababu: ఏపీకి సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

Chandrababu thanks to Union Minister

  • ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు
  • మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని వెల్లడి
  • సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు వెల్లడి

కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి... కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని అన్నారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించమని సీఎం కోరారు. 

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్‌ను కేంద్రమంత్రికి సమర్పించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజక్టును ఆమోదించారని, విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానుందున, అప్పట్లోగా మెట్రో కారిడార్‌ను జాతీయ రహదారులతో అనుసంధానించడం చాలా ముఖ్యమని తెలిపారు. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యమని పేర్కొన్నారు. విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. 

రాజధాని అమరావతికి గేట్ వే‌గా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. విజయవాడ పరిసరాల్లో ఆర్థికవృద్ధికి తోడ్పడటానికి ఇది చాలా అవసరమన్నారు. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోందని, మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదని అన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన  ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు 100 శాతం కేంద్ర సహాయాన్ని అందించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు  ఫేజ్- 1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  ఈ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం తగ్గడమేగాక, ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

'ఎక్స్' వేదికగా ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తున్నందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని ఆయన వెల్లడించారు.

విశాఖ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు నేరుగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రితో అరగంటపాటు సమావేశమయ్యారు. చంద్రబాబునాయుడు ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. 

Chandrababu
Manohar Lal Khattar
Andhra Pradesh
BJP
  • Loading...

More Telugu News