Prakash Karat: నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్లపై ప్రకాశ్ కారత్ తీవ్ర విమర్శలు

- మోదీ ప్రభుత్వాన్ని నియో ఫాసిస్ట్ ప్రభుత్వంగా అభివర్ణించిన ప్రకాశ్ కారత్
- ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వెల్లడించేందుకు ఈ పదాన్ని మొదటిసారి వాడినట్లు వెల్లడి
- ప్రతి దేశంలోనూ ఫాసిస్టు శక్తులు ఉంటాయన్న ప్రకాశ్ కారత్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తీవ్ర విమర్శలు చేశారు. సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశాలు ఈ రోజు కేరళలోని కొల్లాంలో ప్రారంభమయ్యాయి. తన ప్రారంభోపన్యాసంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నియో ఫాసిస్ట్ ప్రభుత్వంగా అభివర్ణించారు.
పార్టీ రూపొందించిన రాజకీయ తీర్మాన ముసాయిదాలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నియో ఫాసిస్ట్ ప్రభుత్వమని పేర్కొన్నట్లు చెప్పారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ కాదని, నియో ఫాసిస్ట్ విధానాలతో ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వెల్లడించేందుకు తాను మొదటిసారి నియో ఫాసిస్ట్ పదాన్ని వాడినట్లు చెప్పారు. ప్రతి దేశంలోనూ ఫాసిస్టు శక్తులు ఉంటాయని, ఓ గ్రూపును వాళ్లు శత్రువుగా భావిస్తారని పేర్కొన్నారు. అలా శత్రువులుగా భావించే వారిలో మైనార్టీలు ఉండవచ్చు, శరణార్థులు కావొచ్చునని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. ఆయన పందొమ్మిదో శతాబ్దపు సామ్రాజ్యవాది అని విమర్శించారు. రాజ్యాలను సొంతం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. పనామా కెనాల్, గ్రీన్ ల్యాండ్, కెనడా, గాజా స్ట్రిప్లపై ట్రంప్ కన్నేశారని ధ్వజమెత్తారు. ట్రంప్ తరహాలోనే నరేంద్ర మోదీ కూడా ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చారని విమర్శించారు. వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.