Mana Mitra: నారా లోకేశ్ చొరవతో ఏర్పాటైన 'మన మిత్ర'లో 200కి చేరిన సేవలు

- వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
- ఇటీవలే మన మిత్ర పేరిట వాట్సాప్ వేదిక ప్రారంభం
- తొలుత 161 రకాల సేవలతో ప్రారంభం
- ఇప్పుడా సేవల సంఖ్య మరింత పెరిగిన వైనం
పౌరసేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకు మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏర్పాటైన 'మన మిత్ర' దూసుకుపోతోంది. 'మన మిత్ర' పేరిట ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతంగా ప్రజలకు సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరి 30వ తేదీన మంత్రి లోకేశ్ చేతుల మీదుగా దేశంలోనే తొలిసారిగా 161 రకాల పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర... కేవలం 50 రోజుల్లోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయిని అందుకుంది.
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చు. గత ఏడాది అక్టోబర్ 22న ఢిల్లీలో మంత్రి లోకేశ్ మెటా ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం తరపున ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల టెన్త్, ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సైతం వాట్సాప్ ద్వారా పొందగలిగారు. ప్రజలు వివిధ రకాల పౌరసేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మన మిత్ర నెం. 9552300009 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ప్రస్తుతం 200 రకాల పౌర సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అందులో విద్య, దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు కూడా ఉన్నాయి. విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపుల వంటి సేవలతో పాటుగా దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్, విరాళాల సమర్పణకు ఇది ఉపయోగపడుతోంది.
అలాగే పర్యాటక ప్రదేశాల సమాచారం, టికెట్ బుకింగ్ వంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లు కూడా సులభంగా పొందొచ్చు. అధునాతన సాంకేతికత వినియోగం ద్వారా ప్రజలకు పౌరసేవలను ఇంటిముంగిటికే తీసుకెళ్లడం విప్లవాత్మకమైన పరిణామం.