UAE: యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు

- ఉరిశిక్ష పడిన వారిని కేరళవాసులుగా గుర్తించినట్లు వెల్లడి
- కుటుంబ సభ్యులకు తెలియజేసిన విదేశాంగ శాఖ
- వీరికి అవసరమైన దౌత్య సాయం అందించినట్లు కేంద్రం వెల్లడి
యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ మేరకు మన విదేశాంగ శాఖ వెల్లడించింది. వారికి ఉరిశిక్ష పడిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఉరిశిక్ష పడిన వారిని కేరళకు చెందిన మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్గా గుర్తించారు.
ఒక యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, ఓ భారతీయుడి హత్య కేసులో మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్ను దోషులుగా గుర్తించారు. వీరిద్దరికి యూఏఈ ఉరిశిక్షను అమలు చేసింది. వీరికి అవసరమైన దౌత్య సాయం అందించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
యూఏఈ జైల్లో ఉన్న భారతీయ మహిళ షెహజాది ఖాన్కు ఉరిశిక్షను అమలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక హత్య కేసులో ఆమెకు ఈ శిక్షను విధించారు. షెహజాది ఖాన్ ఏడాది పాటు న్యాయపోరాటం చేసింది. కానీ ఊరట దక్కలేదు. ఫిబ్రవరి 15వ తేదీన ఉరి తీశారు.