Sridhar Babu: త్వరలో బీజేపీకి రిటర్న్ గిఫ్టు ఇస్తాం: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై శ్రీధర్ బాబు

- బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఓడించాయన్న మంత్రి
- ఆ పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందన్న శ్రీధర్ బాబు
- బీజేపీ, బీఆర్ఎస్ కలయిక వారి పతనానికి తొలి అడుగు అన్న మంత్రి
త్వరలో బీజేపీకి రిటర్న్ గిఫ్టు ఇస్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము బీజేపీకి ఎన్నో రిటర్న్ గిఫ్టులు ఇచ్చామని, త్వరలో మరొకటి ఇస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఓడించాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మరోసారి వెల్లడైందని ఆయన అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలవడమనేది వారి పతనానికి తొలి అడుగు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడానికి బీఆర్ఎస్ బాగా శ్రమించిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో రంజాన్ గిఫ్టు ఇచ్చిందని భావిస్తే, త్వరలో తామూ ఇస్తామని వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన రవీందర్ సింగ్కు వచ్చిన ఓట్లు ఆయనకు వ్యక్తిగతంగా వచ్చినవే అన్నారు.
రెండు పార్టీలు కలిసి ఓడించాయి: పొన్నం ప్రభాకర్
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అభ్యర్థిని పెట్టకుండా బీఆర్ఎస్... బీజేపీతో కుమ్మక్కైందని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఎవరికి ఓటేశారో చెప్పాలని నిలదీశారు. ఈ ఓటమిని తాము సమీక్షించుకుంటామని అన్నారు.