Rohit Sharma: రోహిత్ శర్మ కనీసం 25 ఓవర్లు క్రీజులో ఉంటే కథ మరోలా ఉంటుంది: గవాస్కర్

- ఇటీవల కాలంలో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న రోహిత్
- ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నా అదే ఊపు కొనసాగించడంలో వైఫల్యం
- రెండేళ్లుగా రోహిత్ శర్మ ఆట ఇలాగే ఉంటోందన్న గవాస్కర్
ఇటీవల కాలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరులో నిలకడ లోపించింది. అందుకు గణాంకాలే సాక్ష్యం. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ దూకుడుగానే ఆరంభిస్తున్నా... ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోతున్నాడు. ఈ విషయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఏమంటున్నాడో చూడండి.
రోహిత్ శర్మ 25 పరుగులతో సరిపెట్టుకోవడం కాదు, 25 ఓవర్ల పాటు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలి అంటూ కీలక సూచన చేశాడు. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే టీమిండియా 25 ఓవర్లకే 200 వరకు స్కోరు చేయగలదని, తద్వారా ఆ తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడేందుకు వీలవుతుందని గవాస్కర్ వివరించాడు.
కానీ, గత రెండేళ్లుగా రోహిత్ శర్మ ఆట పడుతూ లేస్తూ అన్నట్టుగా సాగుతోందని, ఇప్పటికీ అతడి ఆటతీరులో మార్పు రావడంలేదని విమర్శించాడు. ఏవో కొన్ని మ్యాచ్ ల్లో సక్సెస్ అవుతున్నప్పటికీ, అతడి నైపుణ్యానికి మచ్చుతునక అనదగ్గ ఇన్నింగ్స్ లు మాత్రం రావడం లేదని అభిప్రాయపడ్డాడు.
ఏ బ్యాట్స్ మన్ అయినా 25-30 పరుగులు చేసి సంతృప్తి చెందగలడా... రోహిత్ కు కూడా ఇది వర్తిస్తుంది... అని పేర్కొన్నాడు. రోహిత్ తొలి ఏడెనిమిది ఓవర్లలో అవుట్ కాకుండా చూసుకోవాలని, కనీసం సగం ఓవర్ల వరకైనా క్రీజులో ఉంటే టీమిండియాకు సానుకూల ఫలితం లభిస్తుందని అన్నాడు.