Nadendla Manohar: సాటివారికి ఒక రూపాయి ఖర్చు చేయని నువ్వా పవన్ గురించి మాట్లాడేది?: నాదెండ్ల

Nadendla Manohar take a jibe at Jagan

  • పవన్ గురించి వ్యాఖ్యలు చేసిన జగన్
  • ఆ మనిషి కార్పొరేటర్ కు ఎక్కువ... ఎమ్మెల్యేకి తక్కువ అంటూ సెటైర్లు
  • 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారంటూ నాదెండ్ల వ్యంగ్యం 

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. జగన్ వై నాట్ 175 అన్నాడని... కానీ ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేది... పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు అని నాదెండ్ల స్పష్టం చేశారు. జర్మనీ విధానాన్నే పవన్ కళ్యాణ్ విడమర్చి చెప్పారని, కానీ, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదని స్పష్టం చేశారు.

యువతను నిలువునా మోసం చేసి 44 లక్షల ఉద్యోగాలిచ్చామని కథలు చెబుతున్నాడు... కానీ    గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకుండా పోయింది అంటూ ఎద్దేవా చేశారు.

"ప్రజా జీవితంలో ఉండి ఒక్క రూపాయి కూడా సాటివారికి ఖర్చు చేయని జగన్ కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కావాలి అని డిమాండ్ చేయడం ఎంత హస్యాస్పదమో గౌరవ సభాపతి గారు ప్రజలందరికీ అర్ధం అయ్యే విధంగా తెలియపర్చారు. అయితే జగన్ నోరుంది కదా అని కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ బాధించాయి. 

వైసీపీ ఒక తాడూ బొంగరం లేని పార్టీ. ఒక సభ ఏర్పాటు చేసి తనకు తానుగా ఆ పార్టీకి జీవిత కాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ఖండించింది. చురకలు కూడా వేసింది. జగన్ కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి. రూల్స్ పాటించని వ్యక్తి. తన పార్టీకి అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో జగన్... పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రభుత్వంలో మరోలా ప్రవర్తించే వ్యక్తి కాదు. జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుంటే వారి కుటుంబాలను ఆదుకునేందుకు స్వయంగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి ఒక్కొ కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించారు. చివరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రాంతానికి చెందిన 24మంది రైతులకు కూడా పవన్ కల్యాణ్ అండగా నిలిచారు” అని వివరించారు. 

ఈ మీడియా సమావేశంలో పార్టీ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, లోకం నాగ మాధవి,  బొలిశెట్టి శ్రీనివాస్,  బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, పత్సమట్ల ధర్మరాజు, వంశీకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, నిమ్మక జయకృష్ణ కూడా పాల్గొన్నారు.

Nadendla Manohar
Pawan Kalyan
Jagan
Janasena
YSRCP
  • Loading...

More Telugu News