Vinod Kumar: నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం: వినోద్ కుమార్

- పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలే లాభపడతాయన్న వినోద్ కుమార్
- కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్య
- ప్రస్తుత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. పునర్విభజన వల్ల కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంపీల స్థానాల విధానాన్నే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే లాభం జరుగుతుందన్నారు.
కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య తక్కువగా ఉందని ఆయన అన్నారు. 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని లోక్ సభ స్థానాలను నిర్ణయించారని, ఇదే పద్ధతిని కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తప్పుబట్టారని ప్రస్తావించారు.