Nadendla Manohar: వారిపై సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయాలి: స్పీకర్ ను కోరిన మంత్రి నాదెండ్ల

- ఓ పార్టీ సభ్యులు అసెంబ్లీ హుందాతనాన్ని దెబ్బతీస్తున్నారన్న మంత్రి నాదెండ్ల
- ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
- స్పీకర్ తీసుకున్న రూలింగ్ పూర్తిగా సమంజసమైనదని వెల్లడి
ఓ పార్టీ సభ్యులు అసెంబ్లీ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఆ పార్టీ సభ్యుల ప్రవర్తనపై సభా హక్కుల కమిటీకి స్పీకర్ ఫిర్యాదు చేయాలని కోరారు. సభా హక్కులను విస్మరించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని రిఫర్ చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు.
"సభా హుందాతనాన్ని కాపాడే బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. ఓ పార్టీ సభా నియమాలను దుర్వినియోగం చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. సభాపతి తీసుకున్న నిర్ణయం (రూలింగ్) పూర్తిగా సమంజసమైంది. సభా హక్కుల కమిటీ దీనిపై లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి ఆ పార్టీ కూడా సహకరించాలి, లేకపోతే ప్రజలే వారిని తిరస్కరిస్తారని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక విధ్వంసం నుండి బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను మరోసారి అభివృద్ధి పథంలో నడిపించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి" అని పేర్కొన్నారు.