Realter Murder: కొడుకుతో కలిసి భర్త గొంతుకోసి చంపేసిన మూడో భార్య

- హైదరాబాద్ లోని పాతబస్తీలో ఘోరం
- చున్నీతో చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణం
- పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు
హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిందో భార్య.. చున్నీతో కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి గొంతుకోశారు. బండ్లగూడ ఠాణా పరిధిలో మంగళవారం ఉదయం ఈ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్కు చెందిన మసీయుద్దీన్(57) అనే రియల్టర్ కొన్నేళ్ల క్రితం షబానా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. మసీయుద్దీన్ కు ఇది మూడో పెళ్లి కాగా షబానకు రెండో వివాహం. షబానాకు అప్పటికే సమీర్ అనే కొడుకు ఉన్నాడు. బండ్లగూడలోని క్రిస్టల్ టౌన్ షిప్ లో మసీయుద్దీన్ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని షబానాను, ఆమె కొడుకును అక్కడ ఉంచాడు. మసీయుద్దీన్ రోజూ వచ్చి వెళుతుండేవాడు.
ఈ క్రమంలో సోమవారం మసీయుద్దీన్, షబానాల మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం మసీయుద్దీన్ అపార్ట్ మెంట్ కు వచ్చాడు. అప్పటికే అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న షబానా.. సమీర్ తో పాటు అతడి స్నేహితుడు ఫరీద్ సాయంతో మసీయుద్దీన్ పై దాడి చేసింది. చున్నీతో మసీయుద్దీన్ చేతులు, కాళ్లు కట్టేసింది. మసీయుద్దీన్ అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆపై గొంతుకోసి హతమార్చారు. మంగళవారం రాత్రి బండ్లగూడ ఠాణాకు వెళ్లి షబానా, సమీర్ లు పోలీసుల ముందు లొంగిపోయారు. హత్యకు కారణాలేంటనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. అయితే, షబానాకున్న వివాహేతర సంబంధమే మసీయుద్దీన్ హత్యకు దారితీసిందని తెలుస్తోంది.