Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్... ఆసీస్ ఖేల్ ఖతమ్

- నేడు దుబాయ్ లో తొలి సెమీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్
- 48.1 ఓవర్లలో 6 వికెట్లకు టార్గెట్ ఛేదించిన టీమిండియా
- మరోసారి మెరిసిన కోహ్లీ
- రాణించిన శ్రేయస్ అయ్యర్, అక్షర్, రాహుల్, పాండ్యా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ దుబాయ్ లో జరిగిన సెమీఫైనల్ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి నేటి మ్యాచ్ తో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.
నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో టీమిండియా 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి వాల్యూబుల్ ఇన్నింగ్స్ తో అలరించాడు. కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 28, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, హార్దిక్ పాండ్యా 28, కేఎల్ రాహుల్ 42 (నాటౌట్) జట్టు విజయంలో తలో చేయి వేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2, మీడియా పేసర్ నేథన్ ఎల్లిస్ 2, బెన్ డ్వార్షూయిస్ 1, కూపర్ కనోలీ 1 వికెట్ తీశారు.
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ లో జరగనుంది.