Arvind Kejriwal: పంజాబ్లో కేజ్రీవాల్ 'విపశ్యన ధ్యానం'... వివరాలు ఇవిగో!

- మరోసారి విపశ్యన ధ్యానంకు వెళుతున్న అరవింద్ కేజ్రీవాల్
- ఈ నెల 5 నుండి 15 వరకు హోషియార్పుర్ ధ్యాన కేంద్రంలోనే
- అధికారం కోల్పోయిన తర్వాత బహిరంగ కార్యక్రమాలకు దూరంగా కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విపశ్యన ధ్యానానికి వెళుతున్నారు. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత కేజ్రీవాల్ పార్టీ కార్యక్రమాలలో మినహా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆయన పది రోజుల పాటు విపశ్యన ధ్యాన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఆయన పంజాబ్లోని హోషియార్పుర్ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 5 నుంచి 15 వరకు ఆయన ధ్యాన కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ గతంలోనూ విపశ్యన ధ్యానం చేశారు. 2023 డిసెంబర్ నెలలో పది రోజుల పాటు హోషియార్పుర్ ధ్యాన కేంద్రంలో ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల పాటు పరిపాలన సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గానూ కేవలం 22 స్థానాలకే పరిమితం కావడంతో పాటు స్వయంగా పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి కేజ్రీవాల్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.