Rohit Sharma: ఇదేమన్నా మా సొంత మైదానమా.... మాకు ప్రతిసారి సవాలే: దుబాయ్ స్టేడియంపై హిట్ మ్యాన్ కామెంట్

- ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే ఆడుతున్న టీమిండియా
- టీమిండియాకు అదే అడ్వాంటేజిగా మారిందంటూ విమర్శలు
- వివరణ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దుబాయ్ నుంచి ఎటూ కదలకుండా ఒకే చోట మ్యాచ్ లు ఆడుతుండడం అడ్వాంటేజిగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత జట్టు సారథి రోహిత్ శర్మ స్పందించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్ లో రేపు (మార్చి 4) టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా దుబాయ్ స్టేడియం గురించి ప్రస్తావించాడు.
"దుబాయ్ స్టేడియం ఏమైనా మా సొంత మైదానమా... అన్ని జట్లలాగే మాకు కూడా ఈ మైదానం కొత్తే. ప్రతి మ్యాచ్ కు కొత్త పిచ్ ఇస్తున్నారు... దాంతో ప్రతి మ్యాచ్ మాకు సవాలుగా మారుతోంది. మేం ఈ మైదానంలో మూడు మ్యాచ్ లు ఆడితే, మూడు రకాల పిచ్ లు ఎదురయ్యాయి. దుబాయ్ స్టేడియంలో నాలుగైదు పిచ్ లు ఉన్నాయి... రేపు (మార్చి 4) జరిగే సెమీఫైనల్ కు ఏ పిచ్ వాడతారన్నది నాకు కూడా తెలియదు. పిచ్ తో పనిలేకుండా ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడడంపై దృష్టి సారించాం" అని రోహిత్ శర్మ వివరించారు.