Rashmika Mandanna: రష్మికకు తప్పకుండా బుద్ధి చెబుతాం: కర్ణాటక కాంగ్రెస్ నేతలు

- ఆహ్వానించినప్పటికీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె రాకపోవడమే ఇందుకు కారణం
- కన్నడను రష్మిక నిర్లక్ష్యం చేస్తున్నారని మండి ఎమ్మెల్యే రవికుమార్ ఆగ్రహం
- తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని మండిపాటు
- కన్నడ నటీనటులపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఫైర్
నటి రష్మిక మందన్నకు బుద్ధి చెబుతామని కర్ణాటక కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆహ్వానించినప్పటికీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె రాకపోవడమే ఇందుకు కారణం. వివిధ భాషల్లో నటిస్తున్న రష్మిక కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని తాజాగా మండి ఎమ్మెల్యే రవికుమార్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా పరిశ్రమ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ... " 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో ఈ రాష్ట్రంలోనే రష్మిక తన సినీ కెరీర్ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కావాలని గతేడాది ఆమెను మేము చాలాసార్లు కలిశాం. కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు.
తాను రాలేనని.. కర్ణాటకు వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. తన ఇల్లు హైదరాబాద్లో ఉందని, కర్ణాటక ఎక్కడో కూడా తనకు తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. కన్నడ భాష, సినీ ఇండస్ట్రీ పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తోంది. ఆమెకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది" అని మండి ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే... రాష్ట్ర రాజధాని బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు ఒకే తాటిపైకి రావాలని, రాష్ట్రంలో జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు.
ఒకవేళ వారు రాకపోతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వల్ల ప్రయోజనం ఏంటి? అని మండిపడ్డారు. చలనచిత్ర పరిశ్రమకు కూడా ప్రభుత్వ మద్దతు అవసరమనే విషయం వారు మరిచిపోకూడదని పేర్కొన్నారు. ఇకనైనా నటీనటుల తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరి చేయాలో కూడా తనకు బాగా తెలుసని హెచ్చరించారు.