Anagani Satya Prasad: పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తాం: అనగాని సత్యప్రసాద్

- ఇళ్ల పట్టాల కోసం 70,232 దరఖాస్తులు వచ్చాయన్న అనగాని
- జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణమని విమర్శ
- వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వేల కోట్లు వెళ్లాయని ఆరోపణ
అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలను ఇస్తామని ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతరావు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ మేరకు తెలిపారు. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70,232 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇస్తే... తమ ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణమని అనగాని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, ధనవంతులు, ఉద్యోగులు, సొంత మనుషులకు ఇళ్ల పట్టాలు పంచి పెట్టారని అన్నారు. భూముల కొనుగోళ్లలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.
డంపింగ్ యార్డుల పక్కనున్న భూములు, వర్షం వస్తే మునిగిపోయే భూములు, శ్మశాన భూములు, నివాసయోగ్యం కాని భూములను రెండింతలు, మూడింతలు అధిక ధరకు ప్రభుత్వంతో కొనిపించారని మండిపడ్డారు. రూ. 10,500 కోట్లతో 26 వేల ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారని... ఇందులో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని చెప్పారు.