Posani Arrest: వాళ్లిద్దరికీ బుద్ధి లేదు... కనీసం నీకైనా ఉంది అనుకున్నాం పవన్ కల్యాణ్: లక్ష్మీపార్వతి

- ఇటీవల పోసాని అరెస్ట్
- తీవ్రంగా తప్పుబట్టిన లక్ష్మీపార్వతి
- ఇది కక్ష సాధింపు అంటూ ఆగ్రహం
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఇటీవల రాయచోటి పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమలో వర్గ భేదాలు సృష్టించడం వంటి అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఏపీలో పోసానిపై దాదాపు 11 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆయన అరెస్ట్ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి స్పందించారు.
గతంలో నంది అవార్డుల విషయంలో పోసాని మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని అన్నారు. ఇది అన్యాయం... అవార్డులన్నీ ఓ వర్గం వారికే ఇస్తున్నారు... ఈ అవార్డు నేను తీసుకోను అని పోసాని అనడంలో తప్పేమైనా ఉందా? అని ప్రశ్నించారు.
మన దేశంలో భారతరత్న వంటి అవార్డులను, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా తిరస్కరించిన వాళ్లు ఉన్నారని వెల్లడించారు. ప్రముఖ గాయని ఎస్.జానకి కూడా గతంలో పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వాల తీరు సరిగా లేదన్న కారణంతో అవార్డులు తిరస్కరిస్తున్నామని వారంతా చెప్పారని వివరించారు.
"పోసాని కృష్ణమురళి కూడా ఆ విధంగానే తనకు వచ్చిన అవార్డును తిరస్కరించారు. ఈ అవార్డు న్యాయబద్ధంగా రాలేదు... ఇందులో ఒకే వర్గానికి ప్రాధాన్యత కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఆయన ఎప్పుడో విమర్శిస్తే... ఆ విషయాన్ని ఇవాళ తీసుకువచ్చి ఆయనపై కేసు పెట్టారు. ఆయనకు డాక్టర్లు ఎన్ని ఆపరేషన్లు చేశారో మాకు తెలుసు. ఆయనకు నెల రోజుల పాటు గొంతు పోయింది.
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఈ విధంగా వేధిస్తున్నారు. ఎక్కడో కేసు పెట్టారు. అది కూడా... మనోభావాలు దెబ్బతిన్నాయట. ఏమయ్యా... మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో తెలియదా! మీ వల్ల ఎన్టీఆర్ మనోభావాలు దెబ్బతినలేదా, నా మనోభావాలు దెబ్బతినలేదా... రోజా, జగన్, భారతమ్మ... వీళ్లందరి మనోభావాలు దెబ్బతినలేదా?
మీరు సాగించిన అకృత్యాలు, అరాచకాలు, అన్యాయాలు... అన్నీ ఇన్నీ కావు! తప్పులన్నీ మీరే చేస్తారు... పోలీసులపై మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవో తెలియదా! వాటిపై మాత్రం కేసులు ఉండవు... వాటన్నింటినీ కొట్టేయించుకుంటారు. ఇవాళ తనకు అవార్డు వద్దన్నందుకు పోసానిని ఎక్కడో కడప జిల్లాలోని జైలులో పెడతారు. 65 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు.
అయినా మీకు న్యాయం ఎక్కడుంది? అప్పుడు కూడా 75 ఏళ్ల వయసున్న వ్యక్తిని (ఎన్టీఆర్ ను) అన్యాయంగా గద్దె దించి, ఆయన ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారు. ఈరోజు కూడా... నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్న వ్యక్తిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు.
పవన్ గారూ... మిమ్మల్ని అడుగుతున్నాను... ఆ రోజు ఆయన భార్యను మీరెంత విమర్శించారండీ! ఏరోజైనా ఆయన భార్య ఇంట్లోంచి బయటికి వచ్చిందా? అటువంటి ఆమెపై కూడా మీ మనుషులను పంపించి నిందలు వేయించారే... ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారా... ఇదేం న్యాయమండీ పవన్ కల్యాణ్ గారూ! కొంచెమైనా మీరు ఆలోచించరా...!
ఆ తండ్రీకొడుకులకు (చంద్రబాబు, లోకేశ్) ఎలాగూ బుద్ధి లేదు... కనీసం మీకైనా బుద్ధి ఉందని మేం అనుకుంటున్నాం. కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో! రాష్ట్రంలో పూర్తి అరాచకంతో కూడిన వ్యవస్థ, దాష్టీక పరిపాలన కనిపిస్తోంది. ఏపీ ప్రజలకు మీరు ఒరగబెట్టిందేమీ లేదు... అటు వంశీని, ఇటు పోసానిపై.. ఇలా వైసీపీ నేతలపై కేసులు పెట్టుకుంటూ పోతున్నారు" అంటూ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.