KTR: ఎస్ఎల్బీసీ ప్రమాదంపై రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకొని ప్రకటన చేయగలరా?: కేటీఆర్

- మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన ప్రకటనలు చేస్తున్నారని విమర్శ
- ప్రతి మంత్రి తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న కేటీఆర్
- కార్మికులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీత
ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి వారం రోజులవుతుంటే, సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకొని అధికారిక ప్రకటన విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మంత్రి తనకు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఇస్తున్నారని, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ, మృతదేహాలు లభ్యమయ్యాయని చెబుతున్నారని, మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ఎందుకు తెలపడం లేదని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. ఇంకో మంత్రి మాట్లాడుతూ, ఎవరూ బతికి లేరని అంటున్నారని, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని కేటీఆర్ నిలదీశారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికుల కుటుంబ సభ్యులు వారి కోసం వేచి చూస్తున్నారని వాపోయారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారిక మీడియా ప్రకటన విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.