G. Kishan Reddy: ముఖ్యమంత్రులతో సంబంధం లేకుండా అభివృద్ధి కోరుకునే వ్యక్తిని: కిషన్ రెడ్డి

- కేంద్ర పథకాలను అమలు చేయాలని సీఎంలకు ఎన్నో లేఖలు రాశానన్న కిషన్ రెడ్డి
- అబద్ధాలు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గదని వెల్లడి
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టీకరణ
పార్టీలు, ముఖ్యమంత్రులతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వ్యక్తిని తాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రులకు ఎన్నో లేఖలు రాశానని చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక విధానం ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో కేంద్రం చేపట్టిన రూ.10 లక్షల కోట్ల విలువైన పనులను తాము ఇప్పటికే వివరించామని అన్నారు. తాను ఇతర కేంద్రమంత్రులను బెదిరించానంటూ కాంగ్రెస్ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో నిర్మించే ఏడు టెక్స్టైల్ పార్కులలో ఒకటి తెలంగాణకు తీసుకువచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఆర్ఆర్ఆర్ను మంజూరు చేసిందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. హామీలను పక్కన పెట్టి బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు.