VH: వీహెచ్ నివాసంలో మున్నూరుకాపు నేతల సమావేశం... హాజరైన బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు

- మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదన్న నేతలు
- కులగణన సరిగ్గా చేయలేదన్న పలువురు నేతలు
- త్వరలో మున్నూరు కాపుల సభను నిర్వహించాలని నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, పార్టీల్లోనూ ప్రాధాన్యత కూడా దక్కడం లేదని ఆ సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు సమావేశమయ్యారు.
ఈ భేటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు హాజరయ్యారు. మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కులగణనపై కృతజ్ఞత సభ పెడదామని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. కులగణన సరిగ్గా చేయలేదని పలువురు మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు వ్యాఖ్యానించారు. మన సామాజిక వర్గం సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు.
మంత్రివర్గంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మున్నూరు కాపుల సభను నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.