Chandrababu: గంగాధర నెల్లూరులో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

- నేడు (మార్చి 1) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
- మధ్యాహ్నం 12 గంటలకు 87.96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
- ఓ కల్లు గీత కార్మికుడి పరిస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు
ఇవాళ (మార్చి 1) ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే 87.96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. రూ.2,397 కోట్ల మేర లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. జియో ట్యాగ్ విధానం ద్వారా పెన్షన్ పంపిణీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఓ కల్లు గీత కార్మికుడి కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం చంద్రబాబు... అతడి ఇద్దరు మనవరాళ్లకు రూ.2 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ఇద్దరు ఆడపిల్లలను వెల్ఫేర్ స్కూల్లో చేర్చాలని, ఆ కల్లు గీత కార్మికుడి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4 వేలు చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం రూ.8 వేలు... 18 సంవత్సరాలు నిండే వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు.
తన పర్యటనలో భాగంగా, గంగాధర నెల్లూరులో స్థానికులను పలకరించిన చంద్రబాబు వారితో సెల్ఫీ దిగారు.