Revanth Reddy: రాష్ట్రంపై భాషను బలవంతంగా రుద్దవద్దు: హిందీ వివాదం వేళ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

- తెలుగు భాషా పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్ రెడ్డి
- డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరుగుతాయని అమిత్ షా చెప్పడం లేదన్న రేవంత్ రెడ్డి
- లిక్కర్ దందా చేయడానికి తాము ఢిల్లీకి వెళ్లడం లేదని ఎద్దేవా
ఏ రాష్ట్రంపై అయినా ఒక భాషను బలవంతంగా రుద్దవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాతృభాష తెలుగు భాషా పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడుకు హిందీ భాష విషయంలో మాటల యుద్ధం సాగుతోన్న తరుణంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటు స్థానాల పెంపు గురించి మాట్లాడుతూ, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని అమిత్ షా చెబుతున్నారని, కానీ సీట్లు పెరుగుతాయని మాత్రం చెప్పడం లేదని ఆయన అన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు. ఉత్తరాదిన సీట్లను పెంచుకొని అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని అన్నారు. నిధులన్నీ 'బీమారు' రాష్ట్రాలకు ఇస్తు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రాతిపదిక ఏమిటో ముందే స్పష్టం చేయాలని ఆయన అన్నారు. జనాభా ప్రాతిపదికన అయితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
తాము రాష్ట్రం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఆస్తులను అడగటం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. హక్కుల ప్రకారం రావాల్సిన నిధులను అడుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం నుండి కేంద్రానికి భారీగా పన్నులు వెళుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో సగం కూడా రాష్ట్రానికి రావడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నింటినీ ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకే తరలిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్కు వచ్చిన సెమీకండక్టర్ కంపెనీని గుజరాత్కు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు.
మెట్రో, ఆర్ఆర్ఆర్ తదితర ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
ఢిల్లీకి వెళ్లి తాము లిక్కర్ దందాలు చేయడం లేదని, రాష్ట్రానికి నిధుల కోసం వెళుతున్నామని వ్యాఖ్యానించారు.