Vallabhaneni Vamsi: నా భర్తను పనిష్మెంట్ సెల్ లో ఉంచారు: వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ

- వంశీని ములాఖత్ లో కలిసిన పంకజశ్రీ, ఎమ్మెల్యే తాటిపర్తి
- 6/4 బ్యారెక్ లో ఉంచి ఇబ్బంది పెడుతున్నారన్న పంకజశ్రీ
- వంశీకి ఫిట్స్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నాయని ఆవేదన
విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న తన భర్త వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని... ఆయనను ఒంటరిగా ఉంచి డిప్రెషన్ కు గురయ్యేలా చేస్తున్నారని ఆమె అన్నారు. వంశీకి ఫిట్స్, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. జైల్లో ఉన్న వంశీని పంకజశ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ములాఖత్ లో కలిశారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన భర్తను 6/4 బ్యారెక్ లో ఉంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారని పంకజశ్రీ అన్నారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీని పనిష్మెంట్ సెల్ లో ఉంచారని, 22 గంటల పాటు ఒంటరిగా ఉంచుతున్నారని తెలిపారు. ఒంటరిగా ఉంచుతూ ఆయన డిప్రెషన్ కు గురయ్యేలా చేస్తున్నారని చెప్పారు. వంశీని ఒంటరిగా కాకుండా వేరే వాళ్లతో కలిపి ఉంచాలని కోరుతున్నామని తెలిపారు. సంబంధం లేని కేసుల్లో ఇరికించారని... కనీసం ఛైర్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు.