SLBC: భయంతో సొంతూళ్లకు పయనమవుతున్న ఎస్ఎల్బీసీ కార్మికులు

- టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులు
- గత శనివారం చోటు చేసుకున్న ప్రమాదం
- టన్నెల్ లో పని చేసేందుకు భయపడుతున్న కార్మికులు
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) టన్నెల్ ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన టన్నెల్ ప్రమాదంలో 8 మంది (ఇంజనీర్లు, కార్మికులు) టన్నెల్ లో చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి ఏడు రోజులు గడుస్తున్నా లోపల చిక్కుకుపోయిన వారిని వెలుపలకు తీసుకురాలేకపోయారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, నేవీ, ఆర్మీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రాతో పాటు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సొరంగంలో దాదాపు 200 అడుగుల మేర పేరుకుపోయిన బురద, టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తికావడానికి మరో రెండు రోజులు పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మరోవైపు, ఎస్ఎల్బీసీ నుంచి టన్నెల్ కార్మికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. టన్నెల్ ప్రమాదంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని కార్మికులు చెబుతున్నారని అధికారులు తెలిపారు. టన్నెల్ లోకి వెళ్లడానికి చాలా మంది కార్మికులు భయపడుతున్నారని అన్నారు. యూపీ, బీహార్, ఝార్ఖండ్, హర్యానాలకు చెందిన కార్మికులు ఇప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు.