Crime News: ఐదేళ్ల చిన్నారిపై దారుణం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు

- మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఘటన
- ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని అపహరించి అఘాయిత్యం
- చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. పొరుగింటి వ్యక్తి లైంగికదాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. నిందితుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించడంతో చిన్నారి ప్రైవేటు భాగాలపై 28 కుట్లు పడ్డాయి. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గ్వాలియర్లోని కమలా రాజా ఆసుపత్రిలో ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. నిద్ర కూడా పోవడం లేదు. ఆమె ప్రైవేటు భాగాలు, ముఖం, దవడలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి బెడ్పై పక్కకు కూడా ఆమె తిరగలేకపోతోంది. అంతగా ఆమె శరీరం గాయాలపాలైంది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 22న రాత్రి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పొరుగునున్న ఝాన్సీ జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక తండ్రిని చూసేందుకు చిన్నారి తాత, నానమ్మ ఆసుపత్రికి వెళ్లారు. దీనిని అవకాశంగా తీసుకున్న పక్కింటిలోని నిందితుడు బాలికను పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ, అతడిని బహిరంగంగా ఉరితీయాలని కోరుకుంటున్నట్టు బాలిక తాతయ్య చెప్పారు. బాలిక అపహరణకు గురైన సమయంలో ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆమె తల్లి ఇంట్లో చిన్న కుమారుడితో ఉంది. బాలికను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య బృందం తెలిపింది. ఇప్పటి వరకు 28 కుట్లు వేసినట్టు పేర్కొంది.