Crime News: సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్ట్

- పూణేలో అత్యంత రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో మంగళవారం ఘటన
- యువతిని ‘అక్కా’ అని సంబోధించి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు
- రాజకీయంగా దుమారం రేపిన ఘటన
- నిందితుడి కోసం రంగంలోకి దిగిన 8 బృందాలు
- శిరూర్ తహసీల్లోని ఓ గ్రామంలో దాక్కున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్ బస్టాండ్లో మంగళవారం ఉదయం బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో ‘అక్కా’ అని మాటలు కలిపిన నిందితుడు, ఆపై ఆమె వేచి చూస్తున్న బస్సు మరో ప్రాంతంలో ఉందని నమ్మించి బస్టాండ్ చివరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆగివున్న బస్సులోకి ఆమెను తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనమైంది. రాజకీయంగానూ దుమారం రేపింది. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి అతను బెయిలుపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం 8 బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో శిరూర్ తహసీల్లోని ఓ గ్రామంలో దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.