Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేన ఢీకొట్టేదెవరిని?.. ఆసక్తికరంగా సమీకరణాలు!

- గ్రూప్-ఏ నుంచి సెమీస్కు భారత్, న్యూజిలాండ్
- గ్రూప్-బీలో ఆసక్తికరంగా మారిన సమీకరణాలు
- లీగ్ మ్యాచ్లు పూర్తయితేనే స్పష్టత
- చివరి లీగ్ మ్యాచ్లో కివీస్తో తలపడనున్న భారత్
- గెలిస్తే గ్రూప్-బీలో అగ్రస్థానానికి
- రేపటి ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్తో కొంత వరకు స్పష్టత వచ్చే అవకాశం
పాకిస్థాన్లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రూప్-ఏలో ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. అగ్ర స్థానంలో ఉన్న న్యూజిలాండ్, తర్వాతి స్థానంలో ఉన్న భారత జట్టు సెమీస్కు అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.
గ్రూప్-బీలో మాత్రం సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రెండేసి మ్యాచ్లు ఆడిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరో విజయం, ఒక మ్యాచ్ టైతో మూడేసి పాయింట్లతో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక, నిన్న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ రేసులోకి రాగా, ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. దీంతో ఇప్పుడు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు మూడూ సెమీస్ రేసులో నిలిచాయి.
గ్రూప్-బీలో రేపు ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనుండగా, ఎల్లుండి (మార్చి 1న) సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఆడతాయి. ఆఫ్ఘనిస్థాన్పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, ఆ జట్టుతోపాటు 3 పాయింట్లతో గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికా కూడా సెమీస్కు చేరుకుంటుంది. అలా కాకుండా ఒకవేళ ఆస్ట్రేలియా ఓడి ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే అప్పుడు ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరుతుంది. ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ మాత్రం ఇంగ్లండ్ విజయంతోపాటు నెట్ రన్రేట్పై ఆధారపడి ఉంటుంది. సఫారీలను ఇంగ్లండ్ ఓడిస్తే అప్పుడు మూడేసి పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నెట్ రన్రేట్ కీలకం అవుతుంది. ఈ విషయంలో సౌతాఫ్రికా (+2.140) ఆసీస్ (+0.475) కంటే ముందుంది. ఇది సఫారీలకు కలిసొచ్చే అంశం.
ఇండియాతో తలపడేద ఎవరు?
గ్రూప్-ఏలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన న్యూజిలాండ్, భారత జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అయితే, రన్రేట్ పరంగా కివీస్ అగ్రస్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మార్చి 2న జరిగే చివరి లీగ్ మ్యాచ్ గ్రూప్ టాపర్ను నిర్ణయిస్తుంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు సెమీస్లో గ్రూప్-బీలోని రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది.
ప్రస్తుతం ఉన్న సమీకరణాలను బట్టి ఇండియా కనుక తన తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధిస్తే మంగళవారం ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడుతుంది. అలా కాకుండా కివీస్ చేతిలో ఓడితే సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. మరోవైపు, ఇంగ్లండ్పై గెలుపుతో ఊపుమీదున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు తన తదుపరి మ్యాచ్లో ఆసీస్ను మట్టికరిపించినా, ఇంగ్లండ్పై దక్షిణాఫ్రికా విజయం సాధించినా అప్పుడు భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్తో సెమీస్ ఆడుతుంది. న్యూజిలాండ్ చేతిలో రోహిత్ సేన ఓడితే కనుక అప్పుడు సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది.
అలా కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తమ తదుపరి మ్యాచుల్లో ఓడి, భారత జట్టు కూడా కివీస్ చేతిలో ఓడితే అప్పుడు కూడా ఆఫ్ఘనిస్థాన్తోనే రోహిత్ సేన ఢీకొనాల్సి ఉంటుంది. ఏమైనా, లీగ్ మ్యాచ్లు పూర్తయ్యే వరకు ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.