Pakistan: మా క్రికెటర్లు అరటిపళ్లను కోతుల కంటే ఎక్కువగా తిన్నారు: వసీమ్ అక్రమ్ తీవ్ర విమర్శలు

- ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నీ నుండి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు
- డైట్ పాటించకపోవడంతో ఆటగాళ్లు ఫిట్గా లేరన్న వసీమ్ అక్రమ్
- పాకిస్థాన్ జట్టులో మార్పులు జరగాలన్న వసీమ్ అక్రమ్
ఐసీసీ ఛాంపియన్షిప్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్థాన్ గ్రూప్ స్టేజిలోనే వెనుదిరిగింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమిపాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుండి నిష్క్రమించింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో, భారత్తో జరిగిన రెండో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
పాక్ జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్లు సరైన డైట్ కూడా పాటించలేదని వసీమ్ అక్రమ్ విమర్శించాడు. డైట్ పాటించకపోవడంతో ఆటగాళ్లు ఫిట్గా లేరని, భారత్తో జరిగిన మ్యాచ్లో డ్రింక్స్ సమయంలో ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్ నిండా అరటిపళ్లు ఉండటం చూశానని, మా ఆటగాళ్లు ఆ అరటిపండ్లను కోతుల కంటే ఎక్కువగా తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంత చెత్త ప్రదర్శన చేసినందుకు గాను జట్టు పైనా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పైనా చర్యలు తీసుకోవాలని వసీమ్ అక్రమ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ జట్టులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్ జట్టులో మార్పులు జరగాలని, భయంలేని క్రికెటర్లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికైనా తప్పులను తెలుసుకుని వచ్చే ఏడాది జరగనున్న ట్వంటీ 20 ప్రపంచ కప్కు సన్నద్ధం కావాలని సూచించారు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు గురువారం నాడు బంగ్లాదేశ్తో చివరి లీగ్ మ్యాచ్లో తలపడనుంది.