Wasim Akram: పాక్ స్పిన్నర్ అబ్రార్ సెలబ్రేషన్ పై వసీం అక్రమ్ ఫైర్

- గిల్ వికెట్ తీసిన ఆనందంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓవరాక్షన్
- ఇక వెళ్లు అన్నట్టుగా గిల్కు అబ్రార్ సంజ్ఞ
- అలా చేయడాన్ని తప్పుబట్టిన పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్
- దేనికైనా సమయం, సందర్భం ఉండవా? అంటూ మండిపాటు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాడు దుబాయ్లో దాయాదుల పోరు జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ను టీమిండియా ఆరు వికెట్ల తేడాతో మట్టికరింపించింది. అయితే, భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ వికెట్ తీసిన పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ చేసిన ఓవరాక్షన్ నెట్టింట విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.
ఇక వెళ్లు అన్నట్టుగా గిల్కు అబ్రార్ సంజ్ఞ చేశాడు. అలా చేయడాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా తాజాగా తప్పుబట్టాడు. దేనికైనా సమయం, సందర్భం ఉండవా? అని మండిపడ్డాడు. జట్టు గెలుస్తున్న సందర్భంలో సంబరాలు చేసుకుంటే ఓ అర్థం ఉంటుంది, కానీ ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ పడితే సెలబ్రేషన్స్ ఏంటో అతనికే తెలియాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"గిల్ను అబ్రార్ ఔట్ చేసిన బంతి అద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అబ్రార్ సెలబ్రేషన్ మీదే నా అభ్యంతరం. దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ లభిస్తే ఒద్దికగా ఉండకుండా ఓవరాక్షన్ చేశాడు.
నాకు తెలిసినంతవరకు అతనికి చెప్పడానికి ఎవరూ లేరు. ఆ సంబరం అన్నింటినీ చంపేసింది. అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరు సరిగా లేదు. టెలివిజన్లో చూస్తున్నప్పుడు అలాగే అనిపించింది. ఆ తర్వాత మనోడి ఓవరాక్షన్ను అందరూ గుర్తించడం తెలిసిందే" అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఆతిథ్య పాకిస్థాన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పరాజయంతో ఆ జట్టు ఇంటిముఖం పట్టింది. నిన్నటి మ్యాచ్లో న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ గెలిచి ఉంటే... పాక్కు సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి. కానీ బంగ్లాను కివీస్ మట్టికరింపించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లగా.. బంగ్లా, పాక్ టోర్నీ నుంచి వైదొలిగాయి.