Revanth Reddy: ఈ-కార్ రేసింగ్లో కేటీఆర్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: బీజేపీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని విమర్శ
- ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ మద్దతు కోరుతోందని ఆరోపణ
- అమెరికా పారిపోయిన వారిని ఎందుకు రప్పించడం లేదని నిలదీత
ఈ-కార్ రేసింగ్ కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉందో చెప్పాలని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ... బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటోందని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ తప్పదని బీఆర్ఎస్ ను బీజేపీ హెచ్చరించిందని ఆయన అన్నారు. అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కేంద్ర ప్రభుత్వం దేశానికి ఎందుకు రప్పించడం లేదని నిలదీశారు. వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరితే తమ విజ్ఞప్తిని పక్కన పెట్టారని అన్నారు.