Revanth Reddy: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

- పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉద్యోగులను క్షోభకు గురి చేస్తున్నారని విమర్శ
- 14 నెలల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్య
- నిజాయితీగా పని చేసే ఉద్యోగులకు ఏం సందేశం ఇస్తున్నారని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేయడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేయడం దారుణమని ఆయన అన్నారు.
ఉద్యోగులకు రొటీన్గా చెల్లించాల్సిన బిల్లుల్లోనూ సీలింగ్ పెట్టడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. నిజాయతీగా పనిచేసే ఉద్యోగులకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు. కళాశాలల యాజమాన్యాలకు ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని, కళాశాల యాజమాన్యాలను మభ్యపెట్టడం సరికాదన్నారు. శాసనమండలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవుతున్నారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఆశ చూపి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొండిచేయి చూపారని ఆరోపించారు. శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.