SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం... ఇంకా బయటపడని ఆ ఎనిమిది మంది

- నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం
- కూలిన టన్నెల్ పైకప్పు... చిక్కుకుపోయిన 8 మంది
- ముమ్మరంగా సహాయక చర్యలు... అయినా కనిపించని పురోగతి
- ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనుల్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. టన్నెల్ లోని 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిపోవడంతో 8 మంది చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉండగా... వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ సాయంత్రానికి కూడా, టన్నెల్ లో వారి పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. వారు సజీవంగానే ఉన్నారా? అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి.
కాగా, టన్నెల్ లో 14వ కిలోమీటరు వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద ఉన్నట్టు గుర్తించారు. టన్నెల్ లో బురదను దాటి వెళ్లేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్కబల్లలు వేసి... వాటి మీదుగా బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 100 మీటర్ల మేర ఉన్న బురదను దాటి వెళితేనే ప్రమాద స్థలికి చేరుకుంటారు.
ఇప్పటివరకు సొరంగ మార్గంలో 13.5వ కిలోమీటరు వరకు రెస్క్యూ టీమ్ లు వెళ్లగలిగాయి. మరో అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీరు, బురద అడ్డంకిగా మారాయి.