Jagan: జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

- జగన్ అసెంబ్లీకి వెళుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి
- రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి వెళుతున్నారని వెల్లడి
- జగన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని డిమాండ్
ఇటీవల గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు జగన్ కు సరైన భద్రత కల్పించకుండా, ఆయనకు హాని కలిగించే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. జగన్ ఎక్కడకి వెళ్లినా జడ్ ప్లస్ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.
జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టే అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించారని... ఎవరికో భయపడి అసెంబ్లీకి వెళ్లడం లేదని అన్నారు.