NEP: తమిళనాడులో జాతీయ విద్యా విధానం అమలు చేసే ప్రసక్తే లేదు: సీఎం స్టాలిన్

- జాతీయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్న కేంద్రం
- రూ.10 వేల కోట్లు ఇచ్చినా ఎన్ఈపీని అమలు చేయబోమన్న తమిళనాడు సర్కారు
- ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో చేరాలన్నా నీట్ తరహాలో పరీక్షలు రాయాల్సి ఉంటుందన్న స్టాలిన్
- విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆందోళన
కేంద్రం ప్రతిపాదిస్తున్న జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ మాటలే అందుకు నిదర్శనం. కేంద్రం రూ.2 వేల కోట్లు ఇస్తామంటోంది... రూ.10 వేల కోట్లు ఇచ్చినా రాష్ట్రంలో ఎన్ఈపీని అమలు చేసేది లేదని స్టాలిన్ తెగేసి చెప్పారు.
ఎన్ ఈపీ ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం కనిపిస్తోందని అన్నారు. తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని... కానీ విద్యార్థుల భవితవ్యం, సామాజిక న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపేలా ఎన్ఈపీ ఉన్నందువల్లే తాము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ వివరించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇప్పుడు అందే ఆర్థికసాయం ఎన్ఈపీతో సాధ్యం కాదని అన్నారు. ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో చేరాలన్నా నీట్ తరహాలో పరీక్షలు రాయాల్సి ఉంటుందని విమర్శించారు. ఎన్ఈపీ వస్తే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.