Group-2 Mains: గ్రూప్-2 పరీక్ష కొన్ని రోజులు వాయిదా వేయండి: ఏపీపీఎస్సీకి లేఖ రాసిన ప్రభుత్వం

- రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
- రోస్టర్ విధానంలో తప్పులున్నాయంటూ అభ్యర్థుల ఆందోళన
- రోస్టర్ విధానం సరిచేశాకే పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి
- అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో రేపు (ఫిబ్రవరి 23) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ పరీక్ష కొన్ని రోజులు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఏపీపీఎస్సీకి లేఖ రాసింది.
రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, గ్రూప్-2 మెయిన్స్ కొన్ని రోజుల తర్వాత నిర్వహించాలని ఏపీపీఎస్సీకి రాసిన లేఖలో పేర్కొంది.
రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయం పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ మార్చి 11న విచారణకు రానుండగా, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అప్పటివరకు పరీక్ష నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది.