Rekha gupta: ఢిల్లీ నూతన సీఎం కార్యాలయంలో ఇప్పటికీ కేజ్రీవాల్ ముద్ర!

- ఢిల్లీ సీఎం కార్యాలయంలో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు
- ఆ ఇద్దరి నుంచి తానెంతో ప్రేరణ పొందానని అప్పట్లో కేజ్రీ ప్రకటన
- కొత్త సీఎం కార్యాలయంలో కూడా అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు
ఢిల్లీ ముఖ్యమంత్రి మారారు. కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలూ చేపట్టారు. యమున నదికి హారతినిచ్చి, మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి... కొన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సేవలను తొలగించారు. గత ప్రభుత్వం ఇతర చోట్ల నియమించిన సిబ్బందిని గతంలో తాము పనిచేసిన చోట్ల రిపోర్టు చేయాలని ఆదేశాలు వెళ్లాయి.
పరిపాలనలో తనదైన మార్కు చూపేందుకు రేఖా గుప్తా కార్యాచరణ మొదలుపెట్టినా, సీఎం కార్యాలయంలో ఇంకా కేజ్రీవాల్ ముద్రను ఆమె కొనసాగిస్తుండటం విశేషం.
సచివాలయంలోని సీఎం కార్యాలయంలో గోడకు కేజ్రీవాల్ హయాంలో ఉంచిన బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలు ఇంకా ఉన్నాయి. 2022 నుంచి ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలు ఉంటున్నాయి.
బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ నుంచి తానెంతో ప్రేరణ పొందానని... ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులలో ఈ మహానేతల ఫొటోలే ఉంటాయని అప్పట్లో ఓ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికీ కార్యాలయంలో కొత్త సీఎం రేఖా గుప్తా కుర్చీ వెనుక అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు కనిపిస్తున్నాయి.