Crime News: జ్యోతిష్కుడిని చంపి పెట్రోలు పోసి తగలబెట్టిన భార్యాభర్తలు

- విశాఖపట్నం జిల్లాలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
- తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో హత్యకు కుట్ర
- జ్యోతిష్కుడిని పొడిచి చంపిన నిందితుడు
విశాఖపట్నం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. జ్యోతిష్కుడిని దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు, ఆపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు. భీమిలి మండలంలోని నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక భార్యాభర్తలు. ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో వీరు నివాసం ఉంటున్నారు.
జ్యోతిష్కుడు అప్పన్న (50)తో పూజలు చేయించుకోవడం కోసం మౌనిక ఈ నెల 7న ఆయనను ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని మౌనిక తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అప్పన్నను హత్య చేయాలని నిర్ణయించి ప్రణాళిక రచించారు. ఈ నెల 9న అప్పన్నను కలిసిన చిన్నారావు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని, పూజలు చేయాలంటూ బైక్పై ఎక్కించుకుని బయలుదేరాడు. బోయపాలెం-కాపులుప్పాడ మార్గంలో కల్లివానిపాలేనికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి, చాకుతో అప్పన్నపై దాడిచేసి చంపేశాడు.
ఈ క్రమంలో చేతికి గాయం కావడంతో తర్వాతి రోజున కేజీహెచ్లో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాతి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జ్యోతిష్కుడి మృతదేహం పడివున్న ప్రాంతానికి వెళ్లి పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభంచిన పోలీసులు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.