Mahesh Kumar Goud: రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసింది.. అలా మాత్రమే ఆయనను గౌరవిస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

- కేసీఆర్ చెప్పినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా? అని ప్రశ్న
- ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్న మహేశ్ కుమార్ గౌడ్
- రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందన్న టీపీసీసీ చీఫ్
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని, ఉద్యమ నేతగా మాత్రమే ఆయనను గౌరవిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, తమ గ్రాఫ్ ఎలా పడిపోతుందని నిలదీశారు.
ఫామ్ హౌస్లో కూర్చొని పెన్ను, పేపర్తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 56 శాతం బీసీలు తమ వెంటే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఏడాది పాలనలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రుణమాఫీతో సహా పలు కీలక హామీలను నెరవేరుస్తుంటే గ్రాఫ్ ఎలా పడిపోతుందో చెప్పాలన్నారు. కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమట్టమై ఫామ్ హౌస్కు పరిమితమైందని విమర్శించారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. తండ్రీకొడుకులు మాత్రమే పార్టీలో ఉంటారని ఆయన అన్నారు. కేసీఆర్కు పగటి కలలు కనడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని హితవు పలికారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే బలం లేని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.