Philippine town: దోమలు పట్టిస్తే డబ్బులిస్తారు.. ఎక్కడంటారా?

- ఫిలిప్పైన్స్లో పెరుగుతున్న డెంగీ కేసులు
- ఐదు దోమలు పట్టిస్తే రూపాయిన్నర ఇస్తా
- ప్రజలకు ఆఫర్ ఇచ్చిన నాయకుడు
ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చునే వారి గురించి... ఈగలు తోలుకుంటున్నాడు అని అంటూ ఉండటం తెలిసిందే! అయితే ఈగల బదులు దోమలను పట్టుకుంటే ఖాళీగా ఉన్నట్టుండదు.. డబ్బుకు డబ్బూ వస్తోంది. ఇది ఎక్కడంటారా? ఫిలిప్పైన్స్ దేశంలో. దోమలు పట్టిస్తే డబ్బులిస్తామంటున్నారు అక్కడ. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా నగరానికి దగ్గర్లో ఉన్న అడిషన్ హిల్స్ పట్టణంలో లక్షకు పైగా జనాభా ఉంది. ఈ మధ్య కాలంలో అక్కడ దోమల బెడద బాగా పెరిగిపోయింది. ఫలితంగా దోమకాటుతో డెంగీ, ఇతర అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి.
ముఖ్యంగా వేల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ కారణంగా మరణాలూ సంభవిస్తున్నాయి. ఫలితంగా ఆ పట్టణ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దోమలను అరికట్టే ప్రణాళికలో భాగంగా అక్కడి నాయకుడు ఒకరు వినూత్నమైన ఆలోచన చేశాడు. దోమలు పట్టుకొని తెండి.. బతికున్నా, చనిపోయినా పర్వాలేదు. ఐదు దోమలు తెచ్చి ఇస్తే.. ఒక ఫిలిప్పైన్స్ పెసో (భారత కరెన్సీలో రూపాయిన్నర) ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.