Vijender Gupta: నాడు సభలో నుంచి గెంటేసిన నేతే నేడు స్పీకర్

- ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజేందర్ గుప్తా
- 2015లో ఆల్కాలంబాపై వివాదాస్పద వ్యాఖ్యలు
- సభలో నుంచి గుప్తాను మోసుకుంటూ బయటకు తీసుకెళ్లిన మార్షల్స్
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఓ సభ్యుడిని మార్షల్స్ బలవంతంగా మోసుకుంటూ బయటకు తీసుకెళ్లారు. 2015లో జరిగిందీ ఘటన. ఆప్ ఎమ్మెల్యే ఆల్కాలంబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను సభలో నుంచి బయటకు పంపించారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు అదే ఎమ్మెల్యే సగర్వంగా సభాపతి స్థానంలో కూర్చోబోతున్నారు. విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ నామినేట్ చేసింది. స్పీకర్ గా ఆయన ఎంపిక లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పాత సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఢిల్లీలోని రోహిణి నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన గుప్తాను ఆప్ సర్కారు పలుమార్లు అవమానకర రీతిలో సభ నుంచి బయటకు పంపించింది. ఎన్నో అవమానాలకు గురైన గుప్తా ఇప్పుడు అసెంబ్లీని నడిపే బాధ్యతను చేపట్టడం విశేషం. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్ పేరును బీజేపీ ప్రకటించింది.