Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి భూములపై నేటి నుంచి మరోసారి సర్వే

- చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జల కుటుంబానికి భూములు
- రెవెన్యూ, అటవీ భూములు ఆక్రమించినట్టు గత సర్వేలో తేలిన వైనం
- హైకోర్టును ఆశ్రయించిన సజ్జల
- న్యాయస్థానం ఆదేశాలతో నేటి నుంచి మరోమారు సర్వే
వైసీపీ నేత, జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించినట్టుగా పేర్కొంటున్న భూములపై నేటి నుంచి సమగ్ర సర్వే జరగనుంది. సజ్జల కుటుంబ సభ్యుల చేతిలో ఆక్రమిత ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్టు సర్వేలో ప్రభుత్వం గుర్తించింది. దీంతో సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం సర్వే నివేదికను న్యాయస్థానానికి అందజేసింది. సజ్జల భూములపై మరోమారు సమగ్రంగా సర్వే నిర్వహించి ఆక్రమిత భూముల సరిహద్దులు గుర్తిస్తామని, రెవెన్యూ, అటవీ భూములు నిర్ధారిస్తామని తెలిపింది. న్యాయస్థానం ఇందుకు అనుమతించింది. అయితే, పంట పొలాలకు నష్టం కలగకుండా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. దీనికి అంగీకరించిన ప్రభుత్వం తాజాగా కడప ఆర్డీవో, డీఎఫ్వో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించింది. నేటి నుంచి ఈ బృందం సజ్జల భూముల్లో సర్వే చేపట్టనుంది.
కాగా, వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జల కుటుంబానికి భూములున్నాయి. సజ్జల సందీప్రెడ్డి పేరున 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్రెడ్డి పేరున 16.85 ఎకరాలు, వై.సత్యసందీప్రెడ్డి పేరున 21.46 ఎకరాలతోపాటు సజ్జల విజయకుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూములు ఉన్నట్టు తేలింది. ఈ మొత్తం భూముల్లో 55 ఎకరాల వరకు ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్టు గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే, వీటిలో తమ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తోంది. రెవెన్యూ శాఖ మాత్రం భూముల ఆక్రమణ జరిగినట్టు రికార్డులు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సర్వేకు సిద్ధమైంది.