Ponguleti Srinivas Reddy: కేసీఆర్ 14 నెలలు అజ్ఞాతంలో ఉన్నారు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

- అజ్ఞాతంలో ఉన్న కేసీఆర్కు అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ప్రశ్న
- బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా
- కేసీఆర్ సీజనల్ రాజకీయ నాయకుడని ఎద్దేవా
14 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న కె. చంద్రశేఖర రావుకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఎలా కనిపిస్తుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఆయన సీజనల్ రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేడిగడ్డ కుంగినప్పుడు, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆయనకు ప్రజలు గుర్తుకు రాలేదని విమర్శించారు. శాసనసభలో కీలకమైన తీర్మానాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, భూ భారతి బిల్లు, మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి కేసీఆర్ హాజరు కాలేదని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా కేసీఆర్ రాలేదని గుర్తు చేశారు. మేం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపాలని ప్రజలు కేసీఆర్ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ప్రజాతీర్పును గౌరవించింది లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన పదేళ్ల కాలంలో తెలంగాణలో తిరోగమనంలోకి ఎలా వెళ్లిందో తెలుస్తుందనే రావడం లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ సమాజం ఆయనను క్షమించదని అన్నారు.