Sharmila: అసెంబ్లీకి వెళ్లి పాలక పక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ కు లేదు: షర్మిల

- నిన్న విజయవాడ జైల్లో వంశీని పరామర్శించిన జగన్
- నేరస్తులను పరామర్శించే జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు ముఖం చెల్లడంలేదని విమర్శలు
- ప్రజలు 11 మందిని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా మారాం చేస్తున్నారంటూ ట్వీట్
వైసీపీ అధినేత జగన్ నిన్న విజయవాడ జైలుకు వెళ్లి వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ కు నేరస్తులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకెళ్లి పరామర్శించేందుకు సమయం ఉంటుంది కానీ... ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం ముఖం చెల్లదు అని ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్లు పెట్టి పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ... అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ కు లేదని విమర్శించారు.
"ప్రజలు 11 మందిని గెలిపిస్తే అసెంబ్లీకి రాకుండా మారాం చేసే వైసీపీ అధ్యక్షుడికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదు. ఈసారైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.