Kollu Ravindra: జగన్ మరో కొత్త డ్రామాకు తెరలేపారు: కొల్లు రవీంద్ర

- మిర్చియార్డు పర్యటనతో జగన్ కొత్త డ్రామాకు తెరలేపారన్న రవీంద్ర
- జగన్ పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణ
- జగన్ కు రెడ్ బుక్ భయం పట్టుకుందని ఎద్దేవా
ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైసీపీ అధినేత జగన్ ఈరోజు గుంటూరు మిర్చియార్డులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై ఏపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... మిర్చియార్డు పర్యటనతో జగన్ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు.
దళితుడిపై దాడి చేసిన వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడం సిగ్గుచేటని రవీంద్ర విమర్శించారు. పోలీసులను, అధికారులను భయపెట్టే విధంగా జగన్ మాట్లాడారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు జగన్ దుర్మార్గ పాలనను తట్టుకోలేకపోయిన జనాలు... ఆయనకు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు.
జగన్ కు రెడ్ బుక్ భయం పట్టుకుందని అన్నారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడిపోతున్నారని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు బెదిరించి తీసుకెళుతున్న వీడియోలు బయటకు వచ్చాయని తెలిపారు.
మద్యం దందాల్లో లక్ష కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు తరలించారని ఆరోపించారు. జగన్ లిక్కర్ దందా వల్ల లక్షల మంది లివర్, కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని మండిపడ్డారు. దోపిడీ కోసం జగన్ మద్యం పాలసీ తీసుకొస్తే... తాము ప్రజల ఆరోగ్యం కోసం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.