Buddha Venkanna: జగన్ వ్యాఖ్యలు చూసి వంశీ భార్య నవ్వుకున్నారు... కొడాలి నానికి ఎందుకంత భయం?: బుద్దా వెంకన్న

Buddha Venkanna Fires on YS Jagan and YSRCP Leaders

  • జగన్ పై బుద్దా వెంకన్న మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు
  • పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్య‌
  • నాని, వంశీ, అవినాశ్‌ అంటే చంద్రబాబుకు అసూయ అని చెప్ప‌డం న‌వ్వు తెప్పిస్తుంద్న టీడీపీ నేత‌
  • సవాళ్లు చేసిన కొడాలి నానికి ఎందుకంత భయమంటూ చుర‌క‌లు

మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ... పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చెప్ప‌డం జగన్ సైకో నైజాన్ని మరోసారి బయట పెట్టింద‌ని దుయ్య‌బ‌ట్టారు. 

రేపు జ‌గ‌న్ త‌న‌ పిల్లలను‌ కలవాలన్నా కూడా అదే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంద‌ని బుద్దా వెంక‌న్న గుర్తు చేశారు. వంశీని కలిసిన జ‌గన్... నందిగం సురేశ్ ను ఇలా ఎందుకు కలవలేద‌ని ప్ర‌శ్నించారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్‌ అంటే చంద్రబాబుకు అసూయ అని చెప్ప‌డం న‌వ్వు తెప్పిస్తుంద‌న్నారు. 

అందుకే జగన్ వ్యాఖ్యలు చూసి వంశీ భార్య అక్కడే నవ్వుకున్నార‌ని, కావాలంటే వీడియో చూసుకోవాల‌ని తెలిపారు. కొడాలి నాని నిన్న జగన్‌తో వచ్చి... మళ్లీ అప్పుడే వెళ్లిపోయార‌ని, సవాళ్లు చేసిన నానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు.

గుడివాడలో కొత్త అభ్యర్థి చేతిలో కొడాలి నాని ఓడిపోయినా సిగ్గు రాలేదా అని దుయ్య‌బ‌ట్టారు. వంశీ, నానిలను నిజంగా లోపల వేయాలంటే నెల్లోనే జైలుకు పంపే వాళ్లమన్నారు. విజయవాడలో బీభత్సం సృష్టించాలని జగన్ ప్లాన్‌ చేశారని ఆరోపించారు. జ‌గ‌న్‌ హ‌యాంలో అదే పోలీసులను వాడుకుని మా వాళ్లపై అక్రమ కేసులు పెట్టించార‌ని, ఇప్పుడు అదే పోలీసుల సంగతి‌ చూస్తాన‌ని ఆయ‌న‌ బెదిరించ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. 

ఈసారి పులివెందులలో కూడా జగన్‌ ఓటమి ఖాయమని బుద్దా వెంక‌న్న పేర్కొన్నారు. వంశీ, నాని వ్యాఖ్యల‌ వల్లే వైసీపీకి నష్టం జరిగిందని, స్వ‌యంగా ఆ పార్టీ వాళ్లే అంటున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ‌లా అండర్ కంట్రోల్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఇది చెడగొట్టడమే లక్ష్యంతో జగన్ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వంశీని పరామర్శించిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలార‌న్నారు. వంశీ రౌడీయిజం, బూతుల‌ గురించి జగన్ కు తెలియదా అని ప్ర‌శ్నించారు. వంశీ, కొడాలి నాని, అవినాశ్ ల‌ దాడులు, బూతులను జగన్ సమర్ధించార‌ని మండిపడ్డారు.

ఇప్పుడైనా జ‌గ‌న్‌ ప్రజలకు మేలు చేసేలా పని చేయాలని హితవు పలికారు. వంశీ, కొడాలి నానిల నోటి‌ దూల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరి పాపం పండిందని... చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. తాము వాళ్లలాగా చట్టవిరుద్దంగా పని చేయబోమని, అధికారమదంతో వాగిన వారంతా జైలుకి వెళ్లక తప్పదని బుద్దా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News