Jagan: జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ

- నేడు గుంటూరు మిర్చియార్డులో పర్యటించాల్సిన జగన్
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ
- తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదన్న అంబటి రాంబాబు
వైసీపీ అధినేత జగన్ నేడు గుంటూరు మిర్చియార్డులో రైతులను కలవాల్సి వుంది. అయితే, ఆయన పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని... అందువల్ల పర్యటనకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలను అతిక్రమించి మిర్చియార్డుకు ఎవరైనా వస్తే అరెస్ట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు, ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదని, రైతుల సమస్యలు మాత్రమే వింటామని తెలిపారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.
ఇంకోవైపు, జగన్ పర్యటనకు వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పర్యటన షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. దాని ప్రకారం, ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. 11 గంటలకు మిర్చియార్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మిర్చియార్డులో రైతులతో చర్చించి... తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించడంతో... జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.